బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?
బ్రతకాలంటే
మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?
భాష- మనిషి తన
భావాలు వ్యక్తీకరించడానికి, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి కనుక్కున్న ఒక
మాధ్యమం. ఏ మనిషికైనా తన మొదటి మాటలు, మొదటి భావాలు, ఆలోచనా విధానం ఏ భాషలొ మొదలవుతాయో అదే తన
మాతృభాష. అలా ప్రతి జాతికి ఒక మాతృభాష ఉంటుంది. ఒక జాతి అస్తిత్వం, సంస్కృతి, సాంప్రదాయం అన్నీ
చాలావరకు మాతృభాషతోనే ముడిపడిఉంటాయి. అలాగే మాతృభాషలో విద్యాబోధన కూడా ఆ జాతి
మనుగడకు చాలా అవసరం.
గతవారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఆంగ్ల మాధ్యమ నిర్ణయం తెలుగు భాష అస్తిత్వానికే
పెద్ద ముప్పుగా మారుతుంది.
ప్రభుత్వం చెప్తున్న కారణాలు: ఒక సారి పరిశీలిద్దాం
1) తెలుగు మాధ్యమం లో చదివితే ఉద్యోగాలు
రావు - ఇవ్వాళ పెద్ద
పెద్ద స్థానాల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు వాళ్ళ మాతృభాషలో చదువుకొన్నవారే. అందరూ
ఇంగ్లిష్ ని తర్వాత నేర్చుకున్నవాళ్ళే. కొంతమందికి ఇంగ్లిష్ సరిగ్గా రాక
సమస్యలొచ్చుండవచ్చు. అది ఇంగ్లిష్ నేర్చుకోని వాళ్ళ తప్పే తప్ప తెలుగు మాధ్యమ
తప్పు కాదు. మనం సాఫ్ట్ వేర్ డాక్టర్ ఉద్యొగాలే ఉన్నాయ్ చాలావరకు అనుకోవడం వల్ల
వచ్చే ఇబ్బందే ఇది. ఇంగ్లిష్ పెద్దగా అవసరం పడని చాలా మంచి ఉద్యోగాలు సమాజంలొ ఉన్నాయ్.
2) తెలుగు మాధ్యమం లొ చదివితే సరిగ్గా
ఎదగలేరు జీవితంలో - కే.
కస్తూరిరంగన్ కమిటీ ఇచ్చిన జాతీయ విద్యా విధానం -2019 ప్రకారం ప్రతి విద్యార్థీ కనీసం 8వ తరగతి వరకు
మాతృభాషలో చదువుకొంటే తన ఆలోచనావిధానం వికసిస్తుందనీ, తద్వారా అది తన పురోగతికీ దేశ పురోగతికి
ఉపయోగపడుతుందని ఆ కమిటీ చెప్పింది. ఇంగ్లిష్ ఎప్పటికైనా నేర్చుకోవచ్చు అది అవసరం
కనుక. కానీ తెలుగు చిన్నప్పుడే నేర్చుకోకపొతే భవిష్యత్తులో రాదు ఎందుకంటే అవసరం
ఉండదు పెద్దగా కాబట్టి. తద్వారా భాష మనుగడే ప్రమాదంలో పడుతుంది.
3) ప్రజలు అడిగారు ఇంగ్లిషే కావాలని
అందుకే పెడుతున్నాం - ప్రజలు
చాలావరకు వ్యక్తి కోణం లో చూస్తారు. కానీ రాజ్యం/ప్రభుత్వం సమాజ, సాంస్కృతిక, భాషా, అస్తిత్వ
కోణాల్లొ చూడాల్సిన అవసరం ఉంది.
4) తెలుగుని ఒక సబ్జెక్ట్ గా
పెడుతున్నాం- తెలుగుని ఒక
సబ్జెక్ట్ గా పెడితే వాళ్ళకు మహా అయితే 300-400 పదాలు వస్తాయేమో. అతి కొద్దిమందికి తప్ప
మిగిలినవాళ్ళకు ఇది ఒక మార్కులు తెచ్చే సబ్జెక్ట్ మాత్రమే అవుతుంది. దాంతో 10వ తరగతి తర్వాత
తెలుగు తెల్సిన వాళ్ళే ఉండరు. ఇప్పటికే చాలామంది తెలుగు స్పష్టంగా చదవలేరు. ఇంక
భవిష్యతులో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారు అవ్తుంది.
5) బడుగు బలహీన వర్గాలకు ఇంగ్లిష్
చదువులు ఇవ్వకూడదా ?- ఇప్పటికే బడుగు వర్గాలలో మిగిలిన వాళ్ళతో
పోల్చితే అక్షరాస్యత తక్కువ. ఇప్పుడు ఈ విధానం వల్ల నిరక్షరాస్యత ఇంకా పెరిగే
ప్రమాదం ఉంది. ఇంగ్లిష్ భాష అర్ధం కాక చదువులు మానేసే పరిస్థితి ఉంది. కొన్ని
గిరిజన వర్గాలు భాష అర్ధం కాక బడి మానేస్తుంటే ప్రభుత్వమే సమగ్ర శిక్షా అభియాన్
కింద వాళ్ళ భాషల్లోనే పుస్తకాలు ముద్రించింది.
ఇంగ్లిష్
మాధ్యమమే మొత్తం గా పెడితే ఏమవుతుంది?
·
తెలుగు భాష ని చదివేవారు బాగా తగ్గిపోతారు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో చదివేవాళ్ళే ఉండకపోవచ్చు. ఇదే జరిగితే తెలుగులో కవులు, కథకులు, రచయిత/త్రు లు ఉండరు. ఏ జాతికైనా సంస్కృతీ
సాంప్రదాయలు ముందు తరాలకు అందించాలంటే ఉన్న ముఖ్య మాధ్యమం రచనలు, పద్యాలు, పాటలు, పుస్తకాలు. మన
పూర్వీకులు మనకు అందించిన ఈ సాంస్కృతిక వారసత్వన్ని అస్తిత్వాన్ని మనం ముందు
తరాలకు అందించాలంటే ఉన్న ముఖ్య మాధ్యమం మాతృభాషే.
·
విద్యార్థుల్లో విశ్లేషణా శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రథం అనే సంస్థ ఇచిన గత సంవత్సరపు వార్షిక నివేదిక లో పిల్లల్లో విశ్లేషణా శక్తి, చదివే శక్తి కి సంబంధించిన గణాంకాలు నేల చూపులు
చూస్తున్నాయ్. ఇప్పుడు ఈ కొత్త విధానం వల్ల అవి ఇంకా తగ్గే ప్రమాదం ఉంది.
·
తెలుగు వార్తా పత్రికలకు ఇదొక శరాఘాతమే. భవిష్యత్తులో తెలుగు చదివేవాళ్ళు
రాసేవళ్ళు ఇద్దరూ ఉండరు. ఆ పత్రికలన్నీ ఇంగ్లిష్ లోకి మారిపోవడమో లేక మూసేసుకోవడమో
జరుగుతుంది. అలానె ఇప్పుడు పాఠశాలల్లో ఉన్న 90% గురువులు తెలుగులో చదివినవారే. వారికి తగిన
శిక్షణ ఇవ్వకుండా ఈ విధానం అమలు చెయ్యడం వల్ల విద్యార్థుల పనితీరు తగ్గిపొయే
ప్రమదం పొంచిఉంది.
పై కారణాల వల్ల ఈ విధానం తెలుగు భాష అస్తిత్వానికీ, విద్యార్థుల భావ
శక్తి కి తద్వార దేశ ప్రగతికి ఒక శరాఘాతమనే చెప్పాలి.
మరి ఏం
చెయ్యొచ్చు?
మారుతున్న కాలం
వలన, ప్రపంచీకరణ వల్ల
ఇంగ్లిష్ అనేది అవసరం అయ్యింది. దానిని అవసరం ఉన్నంత వరకే వాడుకోవడం నేర్చుకోవడం
వల్ల స్థానిక భాషల ఉనికి ప్రమాదం లొ పడకుండా ఉంటుంది. ఇప్పుడు
చాలా ప్రపంచ సూచీల్లొ మనకన్న మెరుగ్గా ఉన్న దేశాలు చాలవరకు తమ స్థానిక భాషలు
ఉపయోగించేవే. ఇంగ్లిష్ అవసరం లేకుండానే చైనా, రష్యా, జపాన్, చాలా యూరప్ దేశాలు అభివృద్ది పథం లొ
దూసుకెళ్తున్నాయి. స్థానిక భాషల గొప్పతనం, అవసరం గమనించే యునెస్కో 2019 సంవత్సర అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి
నేపథ్యం గా " స్థానిక భాషతో అభివృద్ది, శాంతి మరియు సయోధ్య" ని ఎంచుకుంది.
కాబట్టి ప్రాథమిక విద్య లొ మాతృభాష ని రద్దు చెయ్యకుండా తెలుగు పుస్తకాల్లోనే
ముఖ్యమైన పదాల పక్కన బ్రాకెట్లో దాని ఇంగ్లిష్ సమానార్ధకం కూడ పెట్టొచ్చు.
దీనివల్ల అటు విద్యార్థులకు ఇటు గురువులకూ భాషకి కూడ మేలు జరుగుతుంది. తెలుగు
మాధ్యమం లొ చదివే వాళ్ళకు పై చదువులకు వెళ్ళే ముందుతరగతుల్లొ ఇంగ్లిష్ వాడకాన్ని
పెంచి వాళ్ళకి ఇబ్బంది రాకుండ చూడొచ్చు.
మన తోటి
రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ లు వాళ్ళ భాష ని అభివృద్ది చెయ్యడానికి
చాలా చర్యలు తీస్కుంటున్నారు. స్థానిక భాషల్లో చదివిన వారికి తగు ఉద్యోగ భద్రత, విద్యా భద్రత
కల్పిస్తున్నారు. మనం కూడ ఇలాంటి చర్యలు చేపట్టి భాషని వృద్ది చెయ్యాలి. అంతేకాని
మొత్తానికి తీసెయ్యకూడదు. విద్య అనేది రాజ్యంగం లొ ఉమ్మడి జాబితా కాబట్టి, పార్లమెంట్ కే.
కస్తూరిరంగన్ సమర్పించిన జాతీయ విద్యా విధానం- 2019 ముసాయిదా (డ్రాఫ్ట్) ప్రకారం ఒక చట్టం
తీస్కొచ్చి రాస్ట్రాలని అమలు చెయ్యమని చెప్పొచ్చు.
కాబట్టి అన్ని
రాజకీయ పార్టీలు, విద్యా వేత్తలు, సామజిక వేత్తలు రాజకీయలన్నీ పక్కన పెట్టి దీర్ఘ
దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే
భాష మనుగడ, సంస్కృతి, అస్తిత్వం
వర్ధిల్లుతాయి. లేకపోతె దేశం లో 196 భాషలు అంతరించిపోయే ప్రమాదం లో ఉన్నాయని వచ్చిన
వార్తల్లో మొదట అంతరించిపోయేది మన తెలుగే అవ్వొచ్చు. అప్పుడు భవిష్యత్తులో మన
విద్యార్థులు చరిత్ర పాఠాల్లో చదువుకుంటారు " వుయ్
హావ్ హాడ్ డైనోసార్స్ అండ్ టెల్గూ లాంగ్వేజ్ ఇన్ ద వరల్ద్ లాంగ్ లాంగ్ ఎగొ"
అని.
చాలా బాగా రాశారు..మన మాతౄభాషని కాపాడుకోవటం మనందరి ధర్మం
ReplyDelete